Tuesday 13 May 2014

సందేహాలు~సమాధానాలు

1. సంధ్యా సమయానికి ఆఫీసులో  ఉండాల్సిన పరిస్తితి వస్తే (లేదా /ప్రయాణంలో/మీటింగ్లో/నీళ్ళు దొరకని,స్నానంకుదరని )- కాలతిక్రమణ కాకుండా ఎల చెయ్యలో శాస్త్రంలో వివరించబడి ఉందా?
 - ఈ ప్రశ్నకి నిక్కచ్చిగా చెప్పాలంటే, మనం ఆఫీసులో ఉన్నప్పుడు క్రియారూపంగా సంధ్యావందనం చేయలేము కాబట్టి, అందునా , ఎవరి సీట్లో వారు ఉన్నప్పుడు కాకుండా, ఏ మీటింగ్ లోనో ఉన్నట్లయితే, మరీ కుదరదు. అలాంటప్పుడు, వీలు కుదిరితే ఆఫీసులో మానసికముగా సంధ్య చేయడము, అదీ కుదరలేదా ఇంటికి వచ్చి ప్రాయశ్చిత్తముతో చేయడం. ఇక నీళ్ళు దొరకకపోవడమే సమస్య అయితే, మట్టితో కూడా అర్ఘ్యం ఇవ్వవచ్చు అని చెప్పారు. ఇది మహాభారతములో భీష్మాచార్యుల వారు చేశారు కూడా. స్నానం చేయకపోతే, గోధూళి మీద పడేలా వాటి వెంట నడిస్తే, స్నానం చేసినట్లే, అదీ కుదరకపోతే విభూతి స్నానం చేయడమే. నిజంగా స్నానం చేయడం గురించి తెలియాలంటే, మన పూజ్య గురువు గారు చెప్పిన అష్ట పుష్ప పూజ వినండి. ఎన్నో విషయాలు తెలుస్తాయి.


2. సంధ్యావందనానంతరం ఆర్ఘ్య/తర్పన చేసిన జలాన్ని తాగవచ్చా లేక మొక్క మొదట్లొనే వెయ్యాలా - ఒకసారి అర్ఘ్యం ఇచ్చిన జలము లేక తర్పణ చేసిన జలము, చివరలో పరబ్రహ్మార్పణమస్తు అని వదిలిన జలము వేటినీ తాగకూడదు. అవి కేవలం తులసి మొక్క మొదట్లో పోయాలి. అర్ఘ్య/తర్పణములు ఇవ్వగా మిగిలిన కలశలో జలాన్ని, చివరన తీర్థంగా పుచ్చుకోవాలి. 

3. గాయత్రికి ఎమైనా నిర్దిష్టమైన సంఖ్య ఉందా - గాయత్రి జపం శాస్త్రం ప్రకారం ప్రతీ రోజూ 1008 సార్లు చేయాలి, అది కుదరకపోతే కనీసం 108, అదీ కుదరక పోతే కనీసం 28 సార్లు, ఇక మరీ ఆరోగ్యం బాగోక మంచం మీద నుంచి లేవలేకపోతే అప్పుడు 11 సార్లు చేయాలి. అదే పనిగా 11సార్లో లేక కేవలం 28 సార్లో చేస్తూ వెడితే, ఏ పరిస్థితులలో అంతమాత్రమే చేయవచ్చు అని శాస్త్రం చెప్పినదో, నిజంగా ఆ వ్యక్తికి ఆపరిస్థితులు వస్తాయి అని కంచి పరమాచార్య నడిచే దేవుడు చెప్పారు. అంటే, మన శక్తి కన్నా తక్కువ చేస్తే, పోను పోను, ఆ వ్యక్తి తేజస్సు క్షీణించిపోయి, అనారోగ్యముల పాలవుతాడు. ఇది ఎవరినీ బెదిరించడానికి చెప్తున్న మాట కాదండీ. జగద్గురువుల వాక్కు. అంటే నాకు ఉద్యోగం కదండీ, అస్సలు సమయం కుదరదు అని మనము సాకులు చెప్పుకుంటే (నాబోటి గాడికి సుమండీ...), మనసుంటే మార్గం ఉండకపోదు. ఆఫీసు నుంచి ఆలస్యం అయి, ఏ తొమ్మిదింటికో వచ్చినా సరే భోజనం చేయడం మానం లేదా ఒక్కసారి అయినా టీవీలో ముఖ్యాంశాలు చూడడం వదలము... అలా ఎన్నో పనులలోంచి సమయం తీసి ఇక్కడ ఈ విహిత కర్మ చేయడానికి వెచ్చిస్తే, వారు ధన్యులు. అమ్మ కృప అతి త్వరగా పొందుతారు. పూజ్య గురువు గారు ఇంకో మాట కూడా చెప్పారు, అన్నీ అనుకూలముగా ఉన్నప్పుడు సంధ్యావందనము చేయడము, సహస్ర గాయత్రి చేయడం పెద్ద గొప్ప కాదు, మనకి కొన్ని పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నప్పుడు చేయగలిగితే అది గొప్ప అని.

4. అంగన్యాస కరన్యాసములు నాకు రావు కాని పుస్తకంలో చూసి చెస్తున్నా - వాటి అంతరార్థం తెలీదు. వాటి ప్రాముఖ్యత తెలిపే వెబ్ సైట్ లేదా పుస్తకం కలదా - ?


you tube లోని ఈ లంకె ని చూడగలరు.
http://www.youtube.com/watch?v=pGbX1RDywuk
 

5. ఆఫీసుకు వెళ్ళెముందే ప్రాత: మాధ్యాన్నిక సంధ్యావందనం చెయ్యొచ్చా ?- 
చేయవచ్చు. ప్రాతఃకాలం నుంచి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల తరువాత సమయాన్ని సంగవ కాలమంటారు, అప్పుడు మాధ్యాహ్నికము కూడా చేసుకుని ఆఫీసుకి వెళ్ళవచ్చు నిస్సందేహముగా. ఇది శ్రీ పరమాచార్య వారి వాక్కు.

6. ఒక వేళ ఆఫీసులో మానసికంగా అర్ఘ్యం ఇవ్వచ్చ (మళ్ళీ ఇంటికి వెళ్ళాక స్నానం చేసి మళ్ళీ అర్ఘ్యం ఇవ్వడం సరి అయిన పద్దతేనా) - ? .

ఆఫీసులో మనసికముగా చేసి, మళ్ళీ ఇంటికి వచ్చి అర్ఘ్యం చక్కగా ఇవ్వవచ్చు. శ్రధ్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు కదా స్వామి, మన శ్రధ్ధయే అన్నిటికి మూలం కదా. 

7. 16 సంవత్సరాలు దాటిన తరువాత ఉపనయనం చేసి ప్రయొజనం లేదు అంటారు - మరి ఇంట్లో వారికి తెలియక పిల్లలకు ఆలస్యంగా ఉపనయనం చేస్తే, ఆ తల్లి తండ్రులకు ఆ దోషం రాకుండ, ఉపనయనం నిరర్ధకమవ్వకుండా ఎమైనా ప్రాయశ్చిత్త విధి ఉన్నదా?

పూజ్య గురువుగారు చెప్పినట్లుగా 16 సం దాటాక ఉపనయనం చేసినా ఉపయోగం ఉండదు అనేది నిజమే, కానీ అలా కాని వారు (నాకూ కాలేదండి...దురదృష్టవశాత్తు..) బెంగ పడవద్దు. ఎప్పటికి ఎంత తెలిస్తే, అంతా త్రికరణశుధ్ధిగా ఆచరిద్దాము. బాల్యములో ఎనిమిదవ ఏట ఉపనయనం జరగకపోవడం వల్ల ఎంత గాయత్రి చేయాలో, అంతా ఇంకా దానికన్నా ఎక్కువ ఇప్పుడు పట్టుదలతో చేద్దాం... గాయత్రీ అమ్మవారు తప్పక కరుణిస్తారు. ఒక ప్రక్కన మన గురువు గారి సింహనాదం వింటూ, మరో ప్రక్క ఎడతెరిపి లేకుండా గాయత్రీ జపం చేద్దాం. అక్షరలక్షలు పూర్తి చేద్దాం. మన భరతమాత గడ్డ మీద, ఈ ఋషి పరంపర ఉన్న ఈ నేల మీద పుట్టినందుకు, అందునా ద్విజులమై జన్మించినందుకు, మనం అందరమూ మన జీవితములో ఒక్క సారైనా ఒక్క పురశ్చరణ చేద్దాం. (అంటే 24 లక్షల సార్లు జపం చేయాలి..) ఎందుకు చేయలేము. ఈ target ఒక్క సంవత్సరములోనో రెండులోనో కాదు, కనీసం 24 సంవత్సరాలలో...సంవత్సరానికి లక్ష చొప్పున. అమ్మ కరుణిస్తుంది. ఇవన్నీ చేస్తూ, మనకి భావి తరాల పిల్లలకి చక్కగా గర్భాష్టములో శాస్త్ర ప్రకారం ఉపనయం చేద్దాం అని సంకల్పం చేద్దాం. ఒకవేళ ఆ సమయానికి అంత డబ్బు నా దగ్గర ఉండదేమో ఎలా అనుకుంటారా... ఉపనయనము ఆడంబరము కోసం చేసే ఉత్సవం కాదు అని గుర్తెరిగి... కావాలంటే కామకోటి పీఠంలో సామూహిక ఉపనయనములు జరుగుతాయి.